Cold @ North | దేశంలో చలి దంచి కొడ్తున్నది. మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు చలి గుప్పిట్లో మునిగి ఉన్నాయి. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సున్నాకు పడిపోయాయి. ఎత్తైన ప్రాంతాల్లో చలిగాలుల కారణంగా మైదాన ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. రాజస్థాన్ చురులో ఉష్ణోగ్రత 5 డిగ్రీలుగా నమోదైంది. ఢిల్లీ ఇప్పటికే కఠినమైన శీతాకాలాన్ని ఎదుర్కొంటున్నది. ముంబైలో తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా మంచు కురుస్తున్నది. నిరంతరంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి పెరుగుతున్నది. పలు రాష్ట్రాల పర్యాటకులు ఇక్కడికి చేరుకుని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువ మైనస్ 3 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నది. వచ్చే వారం నుంచి చలి మరింత పెరిగే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మాండస్ తుఫాన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లోనూ వాతావరణం మారిపోయింది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలుచోట్ల వానలు కురుస్తున్నాయి.
జమ్ముకశ్మీర్లో మంచు కురుస్తున్న కారణంగా ఉష్ణోగ్రత మైనస్ జోన్కి చేరింది. తెల్లవారుజామున మైదాన ప్రాంతాల్లో పొగమంచు కనిపిస్తున్నది. శ్రీనగర్లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 1 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. షోపియాన్ను రాజౌరి, పూంచ్లతో కలిపే మొఘల్ రహదారి భారీగా కురుస్తున్న మంచు కారణంగా మూసివేశారు. అదే సమయంలో, జమ్ములోని నాథాటాప్లో తేలికపాటి మంచు కురియడంతో చలి పెరిగింది.