న్యూఢిల్లీ: మాంసం అమ్మే షాపులు.. మాంసాహారం అమ్మే రెస్టారెంట్లు.. ఇక నుంచి ఎటువంటి మాంసాన్ని విక్రయిస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. హలాల్ మటనా లేక జట్కా మాంసమా అన్న విషయాన్ని బోర్డులో చెప్పాలి. నార్త్ ఢిల్లీ మున్సిపాల్టీ ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రాంతంలో ఉన్న షాపులు, రెస్టారెంట్లు ఇకపై తమ బోర్డుల్లో ఎటువంటి మాంసాన్ని వాడుతున్నారో చెప్పాలని తీర్మానించినట్లు నార్త్ ఢిల్లీ మేయర్ జై ప్రకాశ్ తెలిపారు. ఆ ప్రతిపాదనకు సభ్యుల నుంచి ఆమోదం కూడా దక్కిందన్నారు. నార్త్ ఢిల్లీ మున్సిపాల్టీ కింద కింద చాందినీ చౌక్, దరియాగంజ్, కశ్మీర్ గేట్ లాంటి ఏరియాలు ఉన్నాయి. హిందువులు, సిక్కులు హలాల్ మటన్ తినరని, అందుకే తమ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్లు, దాబాలు, మీట్ షాపుల్లో పోస్టర్లు పెట్టాలని తీర్మానించినట్లు జై ప్రకాశ్ చెప్పారు. ఒకే కత్తి పోటుతో జంతువును బలి ఇచ్చే విధానాన్ని జట్కా పద్దతి అంటారు. ఇక హలాల్ పద్దతిలో జంతువు గొంతును నిదానంగా కోసేస్తారు.