సిమ్లా, అక్టోబర్ 25: హిమాచల్ప్రదేశ్లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి రెబల్స్ బెడద వేధిస్తున్నది. ప్రతిపక్ష కాంగ్రెస్ నుండి కంటే కమలం పార్టీకి రెబల్స్ నుంచే గట్టి దెబ్బ పడే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే నెల 12న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించడంతో పాటు, ఇద్దరు మంత్రుల నియోజకవర్గాలను మార్పు చేసింది. మరో ఇద్దరు సీనియర్ల స్థానాలను మార్చారు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పలువురు బరిలోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసి అధికార కమలం పార్టీకి సవాల్ విసురుతున్నారు.
బీజేపీని సవాల్ చేసేందుకు స్వతంత్రులుగా..
టికెట్టు నిరాకరణకు గురైన వారిలో ఆనీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కిషోరీలాల్, కుల్లు నుంచి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్సింగ్ ఉన్నారు. సీఎం జైరాం రమేశ్ ఠాకూర్ సొంత జిల్లా మండితో పాటు కుల్లు జిల్లాల్లో బీజేపీని రెబల్స్ బెడద తీవ్రంగా వేధిస్తున్నది. పలు నియోజకవర్గాల్లో కీలక నేతలుగా ఉన్న వారు బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు వేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసిన రూప్సింగ్ కుమారుడు అభిషేక్ ఠాకూర్ సుందేర్ నగర్ నుంచి బీజేపీకి సవాల్ విసురుతున్నారు. ఇక నాచ్చన్ నుంచి గ్యాన్ చౌహాన్, బంజర్ నుంచి నేత మహేశ్వర్ సింగ్ తనయుడు హితేశ్వర్ సింగ్ స్వతంత్రులుగా నామినేషన్ దాఖలు చేశారు.
సోదరుడిపైనే తిరుగుబాటు..
టికెట్ల కేటాయింపు అనంతరం పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రధానంగా ధరమ్పూర్, కార్సోగ్, జోగిందర్నగర్, దారంగ్ నియోజకవర్గాల్లో పలువురు ఆశావహులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ధరమ్పూర్లో మంత్రి మోహిందర్ ఠాకూర్ కుమారుడు రాజత్ ఠాకూర్కు టికెట్టు ఇవ్వడంతో అతని సోదరి వందన గులేరియానే తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తన తండ్రి పితృస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆమె విమర్శించారు. బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. కార్సోగ్లో సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని కొత్త అభ్యర్థికి టికెట్టు ఇవ్వడంతో స్థానిక ఎమ్మెల్యే హీరాలాల్ మద్దతుదారులు రగిలిపోతున్నారు. జోగిందర్నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి ప్రకాశ్ రాణాకు మాజీ మంత్రి గులాబ్ సింగ్ నుంచి సహాయ నిరాకరణ తప్పేలా లేదు. చివరి నిమిషంలో నియోజకవర్గాలను మార్పు చేయడంతో మంత్రులు సురేశ్ భరద్వాజ్, రాకేశ్ పటానియా మద్దతుదారులు హైకమాండ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.