న్యూఢిల్లీ, ఏప్రిల్ 12 : దేశ రాజధాని న్యూఢిల్లీ ముంగిట ఉన్న నోయిడా.. కార్మికుల నిరసనలతో దద్దరిల్లింది. జీతాలు పెంచాలంటూ కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన సోమవారం తీవ్రరూపం దాల్చింది. మూడురోజులుగా నోయిడా పారిశ్రామికవాడలో నిరసన చేస్తున్న కార్మికులంతా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ వేలాది మంది కార్మికులు ఢిల్లీ-నోయిడా ప్రాంతంలోని వీధులు, రహదారుల్ని దిగ్బంధం చేశారు. నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జ్లు, పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వటం.. తదితర ఘటనలతో నోయిడా రణరంగంగా మారింది. ఆగ్రహానికి గురైన కార్మికులు పలు చోట్ల వాహనాలకు నిప్పుపెట్టారు. మరికొన్నింటిని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ-నోయిడా సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కార్మికుల ఆందోళనతో నోయిడా అంతటా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రద్దీగా ఉండే డీఎన్డీ ఫ్లైఓవర్తో సహా కీలకమైన ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారులపై ఎక్కడి వాహనాలు అక్కడే గంటల కొద్దీ నిలిచిపోయాయి. నోయిడా లింక్ రోడ్ను నిరసనకారులు దిగ్బంధించారు. నోయిడా ఫేజ్-2 ప్రాంతంలో ముఖ్యంగా సెక్టార్-1, సెక్టార్-84లో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఢిల్లీ, నోయిడా నుంచి పోలీస్ బలగాలను తరలించాల్సి వచ్చింది. గౌతమ్ బుద్ధనగర్ కమిషనరేట్ పరిధి పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

తక్కువ వేతనాలు, ఎక్కువ పని గంటలు, ఓవర్టైమ్కు చెల్లింపులు చేయకపోవటం, సింగిల్ డ్యూటీకి సంతకం చేయించుకుని డబుల్ డ్యూటీ చేయించడం.. ఇవే తమ ప్రధాన సమస్యలుగా నిరసనకు దిగిన కార్మికులు చెప్పారు. 12 గంటల షిఫ్ట్లో పనిచేస్తున్నా.. కార్మికులకు నెల జీతంగా రూ.11,000 నుంచి 15,000 అందుతున్నదని ఓ నిరసనకారుడు వాపోయాడు. ఇంత తక్కువ మొత్తంతో కుటుంబాన్ని ఎలా పోషించాలని ప్రశ్నించాడు. కంపెనీలు ఓవర్టైమ్ చేస్తున్న కార్మికులకు నిబంధనల మేరకు చెల్లింపులు చేయటం లేదని నాకుల్ సింగ్ అనే కార్మికుడు చెప్పాడు. వేతనాలు సరైన సమయానికి చెల్లించటం లేదని , సింగిల్ డ్యూటీకి సంతకం చేయించుకొని.. డబుల్ డ్యూటీ చేయించుకుంటున్నారని అన్నారు.