న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నోయిడాలోని ట్విన్ టవర్స్ను ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పరిసర ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘటన గురించి తెలిసి జనం తరలిపోతున్నారు సరే.. మరి ఈ విషయం తెలియని వీధి కుక్కల సంగతి ఏమిటి..? బ్లాస్టింగ్ సమయంలో పరిసరాల్లో ఉంటే అవి బలి కావాల్సిందేనా..?
నోయిడాలోని ఓ స్వచ్ఛంద సంస్థ మదిలో మెదిలిన ప్రశ్నలు ఇవి. ఆలోచన వచ్చిందే ఆలస్యం ఆ స్వచ్ఛంద సంస్థ రంగంలోకి దిగి పరిసరాల్లోని వీధి కుక్కులను పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు మొత్తం 35 వీధి కుక్కలను సేఫ్ ప్లేస్కు తరలించారు. కాగా, 48 అంతస్తుల ఎత్తయిన ట్విన్ టవర్స్ కూల్చివేత కోసం 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు.
ట్విన్ టవర్స్ చుట్టూ 450 మీటర్ల పరిధిని ఎక్స్ప్లోషన్ జోన్గా ప్రకటించి ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కూల్చివేత పర్యవేక్షణకు ఏడు సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. ఎనిమిది ఫైరింజన్లు, ఆరు అంబులెన్స్లను సిద్ధం చేశారు. అధికారులకు సహాయంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, 560 మంది పోలీసులు, 100 మంది రిజర్వ్ బలగాలు రంగంలోకి దిగాయి.