జైపూర్: ఆసుపత్రిలో వీల్చైర్ లేకపోవడంతో ఒక వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. గాయపడిన కుమారుడ్ని ఏకంగా స్కూటర్పై ఆసుపత్రిలోని లిఫ్ట్లో మూడో అంతస్తుకు తీసుకెళ్లాడు. విస్తూపోయే ఈ సంఘటన రాజస్థాన్లోని కోటాలో జరిగింది. న్యాయవాది మనోజ్ జైన్ కుమారుడి కాలికి గాయమైంది. దీంతో గురువారం మధ్యాహ్నం కోటాలోని ప్రభుత్వ ఆసుపత్రికి (Kota hospital) కుమారుడ్ని తీసుకెళ్లాడు. అయితే ఆర్థోపెడిక్ వార్డు మూడో అంతస్తులో ఉంది. దీంతో కుమారుడ్ని మూడో అంతస్తుకు తీసుకెళ్లేందుకు ఆసుపత్రి సిబ్బందిని వీల్చైర్ కోరాడు. అయితే వీల్చైర్స్ లేవని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆసుపత్రి లోపలకు తీసుకొచ్చాడు. కుమారుడ్ని వెనుక కూర్చోబెట్టుకుని లిఫ్ట్ వద్దకు చేరుకున్నాడు. స్కూటర్తో సహా లిఫ్ట్లోకి ఎక్కి మూడో అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి స్కూటర్ నడుపుతూ ఆర్థోపెడిక్ వార్డుకు కుమారుడ్ని తీసుకెళ్లాడు.
కాగా, గాయమైన కుమారుడి కాలికి వైద్య సిబ్బంది కట్టుకట్టిన తర్వాత తిరిగి స్కూటర్పై కిందకు తీసుకెళ్లేందుకు మనోజ్ జైన్ ప్రయత్నించాడు. అయితే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని స్కూటర్ కీ తీసుకున్నారు. దీనిపై మనోజ్ జైన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆసుపత్రిలో వీల్చైర్లు లేకపోవడంతో సిబ్బంది అనుమతితో గాయపడిన కుమారుడ్ని స్కూటర్పై మూడు అంతస్తుకు తీసుకెళ్లినట్లు చెప్పాడు. ఆసుపత్రిలో మౌలిక వసతులు లేకపోవడంపై మండిపడ్డాడు.
మరోవైపు ఆసుపత్రిలోని అవుట్పోస్ట్ వద్ద ఉన్న పోలీసులకు ఈ వాగ్వాదం గురించి తెలిసింది. దీంతో వారు వెంటనే మూడో అంతస్తుకు చేరుకున్నారు. న్యాయవాది మనోజ్ జైన్ చేసిన పనిని పోలీసులు కూడా సమర్ధించారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పి రాజీ కుదిర్చారు. వీల్చైర్స్ను అందుబాటులో ఉంచుతామని వైద్యాధికారులు హామీ ఇచ్చారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
The way people are not surprised or shock it seems this is regular affair at Government hospital in Kota, Rajasthan pic.twitter.com/YI3JG6HQqD
— नंदिता ठाकुर 🇮🇳 (@nanditathhakur) June 17, 2023