No Vaccine No Liquor | దేశంలో కరోనా మహమ్మారిని నియంత్రించడం కోసం రకరకాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని జిల్లాల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారికే మద్యం అమ్మాలని నిర్ణయించారు.
తాజాగా మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికే లిక్కర్ అమ్మాలని జిల్లా యంత్రాంగం రూల్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఒక ఎక్సైజ్ అధికారి.. మద్యం బాబులు తాము వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదని, కేవలం నోటి మాట చెప్తే చాలని అన్నారు.
ఆయన పేరు ఆర్పీ కిరార్. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో నోటి మాట చాలని లేకపోవడం గురించి ఆయన్ను అడగ్గా.. ‘తాగే వాళ్లు అబద్ధం చెప్పరు’ అంటూ నీతులు చెప్పారు. జిల్లాలో కొనసాగుతున్న మెగా వ్యాక్సిన్ డ్రైవ్లో ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకునేలా చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలోనే జిల్లాలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారికి మద్యం అమ్మకూడదంటూ మార్గదర్శకాలు విడుదల చేశారు.