దెబ్బతింటున్న శాంతి, సామరస్యం
కొన్ని వర్గాలే లక్ష్యంగా దాడులు
ఆందోళన వ్యక్తం చేసిన ప్రముఖులు
ముఖ్యమంత్రి బొమ్మైకి బహిరంగ లేఖ
బెంగళూరు, జూన్ 24: కర్ణాటకలో శాంతికి విఘాతం కలిగించేలా, భిన్నత్వానికి భంగం వాటిల్లేలా ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై 75 మంది ప్రముఖులు (రిటైర్డ్ సివిల్ అధికారులు, రచయితలు, కళాకారులు, విద్యావేత్తలు, తదితరులు) ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం బసవరాజ్ బొమ్మైకు బహిరంగ లేఖ రాశారు. కొన్ని వర్గాలే లక్ష్యంగా చేసుకొని హింస, భయోత్పాతాన్ని సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకొని స్పష్టమైన సందేశం ఇవ్వాలని కోరారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న పలువురు కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.
అభివృద్ధి, పురోగతికి ఆటంకం
ముస్లింలు, క్ట్రిస్టియన్లు, దళితులపై దాడులతో పాటు ఆయా వర్గాలే లక్ష్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విభజన, విద్వేష చర్యలు వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయని, పురోగతి దెబ్బతింటుందని లేఖలో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని, అభద్రతను పెంచుతాయని హెచ్చరించారు. మత సామరస్యాన్ని పునరుద్ధరించడం ప్రభుత్వ తక్షణ, ముఖ్యమైన కర్తవ్యం అని ప్రముఖులు లేఖలో సీఎంకు సూచించారు. లేఖపై సంతకాలు చేసిన వారిలో మాజీ ఐఎఫ్ఎస్ ఎల్లప్ప రెడ్డి, మాజీ అడ్వకేట్ జనరల్ రవివర్మకుమార్, మాజీ ఐఏఎస్లు చిరంజీవ్ సింగ్, రఘునందన్, మాజీ ఐపీఎస్ అజయ్కుమార్ సింగ్, రచయితలు శశి దేశ్పాండే, వైదేహి, చరిత్రకారుడు రామచంద్ర గుహ, సినీ డైరెక్టర్ గిరీష్ కసరవల్లి ఉన్నారు.