న్యూఢిల్లీ: కోయంబత్తూర్లోని వైమానిక దళ ఇన్స్టిట్యూట్లో ఓ మహిళా వైమానిక దళ ఆఫీసర్ అత్యాచారానికి గురైనట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ మహిళా ఆఫీసర్కు రెండు వేళ్ల పరీక్షను కూడా నిర్వహించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఇవాళ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ మహిళా ఆఫీసర్కు ఫింగర్ టెస్ట్ నిర్వహించలేదన్నారు. ఇలాంటి ఘటనల పట్ల ఐఏఎఫ్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని, ఆ మహిళా ఆఫీసర్పై టూ ఫింగర్ టెస్ట్ జరిగినట్లు తప్పుడు వార్తలు వచ్చాయని, అసలు అలాంటి పరీక్ష జరగలేదని, రూల్స్పై పూర్తిగా అవగాహనతో ఉన్నామని, దీనిపై చర్యలు తీసుకుంటాన్ని ఐఏఎఫ్ చీఫ్ తెలిపారు.
ఐఏఎఫ్ శిక్షణ కేంద్రంలో ఓ ఆఫీసర్ తనను రేప్ చేసినట్లు ఇటీవల ఓ మహిళా ఐఏఎఫ్ ఆఫీసర్ ఆరోపించింది. కోయంబత్తూరులో ఈ ఘటన జరిగింది. మహిళా ఆఫీసర్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఆ ఆఫీసర్ను అరెస్టు చేశారు. తనకు ఫింగర్ టెస్ట్ను కూడా చేసినట్లు ఆమె పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నది. నిజానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆ పరీక్షలపై నిషేధం ఉన్నది. పోలీసు ఫిర్యాదు సమయంలో డాక్టర్లు మరింత వేధించారని, ఫింగర్ టెస్ట్ను వీడియో రికార్డు చేసేందుకు ప్రయత్నించినట్లు ఆమె ఆరోపించింది.