Hardeep Singh Puri : దేశంలో చమురు సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర చమురు సరఫరా మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. చమురు సరఫరాలో ఇబ్బందులేమీ లేవని ప్రకటించారు. దేశంలో తగినన్ని చమురు నిల్వలున్నాయని వెల్లడించారు. దేశ ప్రజలు పెట్రోల్, డీజిల్ వినియోగంలో బాధ్యతగా ప్రవర్తించాలని, వీలైనంత తక్కువగా వాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో దేశంలో చమురు సరఫరాపై చర్చ మొదలైంది. మోదీ సూచనపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో హర్దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు. చమురు సరఫరాలో సమస్య లేదన్నారు. ‘‘దేశంలో ప్రస్తుతం 69 రోజులకు సరిపడి క్రూడాయిల్, ఎల్ఎన్జీ నిల్వలున్నాయి. 45 రోజులకు సరిపడా ఎల్పీజీ స్టాక్ ఉంది. ఎల్పీజీ ఉత్పత్తిని దేశంలో గణనీయంగా పెంచాం. రోజుకు 35,000 టన్నుల నుంచి 50,000 టన్నుల వరకు ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచాం. ప్రస్తుత పశ్చిమాసియా యుద్దం వల్ల తలెత్తిన సంక్షోభాన్ని సమర్ధవంతంగా, బాధ్యతగా ఎదుర్కొన్నాం.
ఎక్కడా చమరు సరఫరాలో సమస్య తలెత్తలేదు. ప్రధాని మోదీ ఇచ్చిన సలహా ప్రజల్ని అప్రమత్తం చేయడానికే. దేశంపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే ఆయన ఈ మాటలు చెప్పారు” అని హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఇటీవల మోదీ మాట్లాడుతూ చమురు వినియోగం తగ్గించాలని, విదేశీ టూర్లు, బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే. అలాగే, పర్యాటకులు ఎక్కువగా దేశంలోనే పర్యటించాలని, దేశీయ ఉత్పత్తులే కొనాలని కూడా ప్రజలకు సూచించారు.