యూపీ దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్ల దుస్థితి ఇది
లక్నో, మే 14: అది బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్. ఆరోగ్యమంత్రి బ్రిజేశ్ పఠక్ లక్నోలోని ఒకట్రెండు దవాఖానలను ఇటీవల తనిఖీ చేశారు. దవాఖానల్లో సేవలు, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణను పరిశీలించి అధికారులను మెచ్చుకొన్నారు. మంత్రి పర్యటన ఫొటోలు, కథనాలు పెద్దఎత్తున వార్తాపత్రికలు, టీవీల్లో వచ్చాయి. దీన్ని చూసిన హసాన్గంజ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మహేంద్రసింగ్ ఖడగ్వంశీ కూడా తన నియోజకవర్గంలోని దవాఖానల్లో ఆకస్మిక పర్యటన చేయాలని భావించారు. అనుకున్నదే తడవుగా మరుసటిరోజే దాబర్సీలోని ఓ కమ్యూనిటీ సెంటర్కు వెళ్లారు. అయితే, సిబ్బంది లేకుండా నిరుపయోగంగా మారిన ఆక్సిజన్ ప్లాంట్ ఆయనకు దర్శనమిచ్చింది. విషయమేంటని ఆరాతీస్తే, ప్లాంట్ నడిపేందుకు డీజిల్ లేదని, జీతాలు ఇవ్వకపోవడంతో టెక్నీషియన్లు అసలే రావట్లేదని అధికారులు సమాధానమిచ్చారు.
మరో దవాఖానకు వెళ్లి పరిశీలించగా సీన్ రిపీట్. ఎమ్మెల్యే పర్యటించిన మరో ఐదారు ప్రభుత్వ దవాఖానల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎమ్మెల్యే.. లక్నోలో దవాఖానలు అంత బాగుంటే.. ఇక్కడి హాస్పిటల్స్కు ఏమైందని అధికారులపై భగ్గుమన్నారు. తొలుత భయపడిపోయిన అధికారులు చివరకు అసలు విషయం చెప్పారు. ఆరోగ్యమంత్రి తనిఖీకి వస్తున్నట్టు ముందస్తుగా ఆయా దవాఖానలకు సమాచారం అందిందని, ఉన్నపళంగా వాళ్లు ప్లాంట్లకు మరమ్మత్తులు చేయడంతో అసలు విషయం బయటపడలేదని రహస్యాన్ని విప్పి చెప్పారు. సెకండ్ వేవ్లో రూ. 300 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పా టు చేసిన ఆక్సిజన్ ప్లాంట్లు ప్రస్తుతం మూతబడే ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో షాక్ అవ్వడం అధికార పార్టీ ఎమ్మెల్యే వంతైంది.