ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో ఎలాంటి చీలిక లేదని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇప్పటికీ తమ పార్టీ నాయకుడేనని స్పష్టం చేశారు. ఆయన తిరుగుబాటును భిన్న వైఖరి అని అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి సాధారణమేనని అన్నారు. శుక్రవారం కొల్హాపూర్ పర్యటనకు బయలుదేరే ముందు పూణె జిల్లాలోని తన స్వస్థలమైన బారామతిలో శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. అజిత్ పవార్ తమ నాయకుడేనని, ఇందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ‘రాజకీయ పార్టీలో చీలిక అంటే ఏమిటి? పార్టీలోని పెద్ద సమూహం జాతీయస్థాయిలో విడిపోయినప్పుడు చీలిక ఏర్పడుతుంది. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరుగలేదు. కొంతమంది నాయకులు భిన్న వైఖరిని అనుసరించారు. పార్టీలో విభజనగా దీనిని పిలువలేం’ అని అన్నారు.
కాగా, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, గురువారం మీడియాతో మాట్లాడుతూ అజిత్ పవార్ తమ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నేత అని తెలిపారు. అయితే పార్టీకి వ్యతిరేకంగా ఆయన తీసుకున్న వైఖరిపై అసెంబ్లీ స్పీకర్కు తాము ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీనిపై స్పీకర్ నిర్ణయం కోసం తాము ఎదురుచూస్తున్నామని అన్నారు.
మరోవైపు సుప్రియా సూలే చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా శరద్ పవార్ ఆ మేరకు శుక్రవారం వివరణ ఇచ్చారు. అజిత్ పవార్ ఇప్పటికీ తమ పార్టీ నాయకుడేనని స్పష్టం చేశారు. ఆయన తిరుగుబాటు భిన్నవైఖరి అని అన్నారు.