Indian Army | ఆపరేషన్ సిందూర్ తర్వాత పెరిగిన ఉద్రిక్తతలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో.. సోమవారం ఇరుదేశాల డీజీఎంవో స్థాయిలో మధ్య చర్చలు జరుగనున్నాయి. ఈక్రమంలో ప్రస్తుతంలో సరిహద్దు పరిస్థితిపై సైన్యం ప్రకటన చేసింది. జమ్మూ కశ్మీర్లో రాత్రి కాల్పులు జరుగలేదని పేర్కొంది. అంతర్జాతీయ సరిహద్దు, ఇతర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ప్రశాంతంగా ఉన్నట్లు వెల్లడించింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోలేదని సైన్యం పేర్కొంది. ఇటీవల రోజుల్లో తొలిసారిగా రాత్రి వేళ ప్రశాంతమైన వాతావరణం కనిపించిందని చెప్పింది. ఇదిలా ఉండగా.. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల జీడీఎంవోలు హాట్లైన్లో చర్చలు జరుపనున్నారు.
కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపుపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 10న ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన జరిగిన విషయం తెలిసిందే. అవగాహన ఉల్లంఘనలపై పాక్ డీజీఎంవోకు హాట్లైన్లో భారత్ సందేశం పంపింది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తే తగిన రీతిలో జవాబిస్తామని హెచ్చరించింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఉగ్రదాడికి పాకిస్తాన్లో ఉగ్రమూకలే కారణమని భారత్ గుర్తించింది. ఈ క్రమంలో మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాక్, పీవోకేఈలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత భారత్ను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైల్స్తో విరుచుకుపడింది. దాంతో భారత సైన్యం దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే.