చెన్నై, జనవరి 3: బీజేపీకి తమిళనటి గాయత్రి రఘురామ్ రాజీనామా చేశారు. తమిళనాడు బీజేపీలో మహిళలకు భద్రత లేదని ఆరోపించారు. నిజమైన కార్యకర్తలను తమిళనాడు పార్టీ విభాగంలో పట్టించుకొనేవారే లేరని ఆమె మండిపడ్డారు. తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరైన ఓ వేడుకకు హాజరైందన్న కారణంగా గత నవంబర్లో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
తన రాజీనామాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై కారణమని గాయత్రి పేర్కొన్నారు. కాగా పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ సీనియర్ నేత ఆమె ఆరోపణలను ఖండించారు. ఆమె పోవడం వల్ల పార్టీకి నష్టమేమీ లేదని అన్నారు.
బీజేపీ తమిళ భాషాభివృద్ధి విభాగానికి ఇంచార్జిగా ఉన్న గాయత్రిని పార్టీకి చెడ్డపేరు తెచ్చే పనులు చేస్తున్నారని నవంబర్ 23న సస్పెండ్ చేశారు. ‘విచారణకు అవకాశం ఇవ్వలేదు.. మహిళలకు సమాన హక్కులు లేవు, మహిళలంటే పార్టీలో ఎవరికీ గౌరవం లేదు’ అని ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు. పార్టీలో ఉండి ఇబ్బందులు పడేకన్నా, బయట ఉండి ట్రోల్స్ ఎదుర్కోవడమే మేలని భావిస్తున్నట్టు తెలిపారు.