హైదరాబాద్, మే 7: పదేండ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత ఎన్నికలకు వెళ్లినప్పుడు.. తన పదవీకాలంలో ప్రజలకు చేసిన మేలు గురించి చెప్పి ఓట్లు అడగాలి. దేశం సాధించిన విజయాలను వివరించి మళ్లీ గెలిపించమని కోరాలి. మా పాలన నచ్చితేనే, మీకు మంచి జరిగితేనే మాకు ఓట్లు వేయండని ప్రజలకు చెప్పే ధైర్యం చేయాలి. కానీ, ప్రధాని మోదీ ప్రచారసరళిని చూస్తే ఇవి కనిపించడం లేదు.
కేవలం బీజేపీ గెలవకపోతే ఏదో జరిగిపోతుందని, ఉపద్రవం ముంచుకొస్తుందని ప్రజల్లో భయం, అభద్రతాభావం కల్పించే, ఉద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రమే ఆయన ప్రచారంలో కనిపిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పదేండ్ల కింద చెప్పిన మాటలనే ఇప్పుడు కూడా చెప్పి ఓట్లు అడుగుతున్నారంటే ఈ పదేండ్ల పాలనలో ఓట్లు కురిపించే గొప్ప పనులేమీ చేయలేదని ఆయన అంగీకరించినట్టు అవుతున్నదని అంటున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు.
ఒక్కో దశ పూర్తయిన కొద్దీ పెరుగుతున్న అసహనం
మధ్యప్రదేశ్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ… కాంగ్రెస్ మళ్లీ ఆర్టికల్ 370ని తీసుకురావొద్దంటే, అయోధ్యలో రామాలయానికి బాబ్రీ తాళం వేయొద్దంటే మోదీకి 400 స్థానాలు కావాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వస్తే గతంలో షా బానో కేసు మాదిరిగానే అయోధ్య రామమందిరంపై సుప్రీంకోర్టు తీర్పునూ తారుమారు చేస్తుందని ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు ఎత్తేసి ముస్లింలకు ఇవ్వాలనుకుంటున్నదని పేర్కొన్నారు.
అంతేకాదు, రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తుందని ఆరోపించారు. ఈ అన్ని ప్రకటనల్లో కేవలం అసహనం, అభూతకల్పనలు, అసాధ్యమైన అంశాలు మాత్రమే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు రామరాజ్యం కావాలో, ఓట్ జిహాద్ కావాలో నిర్ణయించుకోవాలని మరో సభలో పేర్కొన్నారు. మతపరమైన అంశాలను తెరమీదకు తెచ్చి ఓట్లు రాబట్టుకునేందుకే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. ఒక్కో దశ పోలింగ్ పూర్తవుతున్న కొద్దీ ఆయన ఇలాంటి వ్యాఖ్యల తీవ్రతను పెంచుతున్నారని, బహుశా పోలింగ్ సరళిలో సానుకూలత కనిపించడం లేదన్న అనుమానాల వల్లనే ఈ అంశాలను నమ్ముకుంటున్నారేమోనని అభిప్రాయపడుతున్నారు.