హరిద్వార్: జాతీయ రహదారిపై ఉన్న గుంతల్ని తప్పించబోయి.. క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి ఆదివారం చెప్పిన విషయం తెలిసిందే. యాక్సిడెంట్కు గురై చికిత్స పొందుతున్న పంత్ను కలిసిన తర్వాత సీఎం థామి ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖండించింది. క్రికెటర్ పంత్ ప్రమాదానికి గురైన ప్రాంతంలో గుంతలు లేవని హైవేస్ అధికారి ఒకరు తెలిపారు.
ఎన్హెచ్ఏఐ రూర్కీ డివిజన్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రదీప్ సింగ్ గుసైన్ మాట్లాడుతూ.. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో రోడ్డుపై గుంతలు లేవని, ప్రమాదం జరిగిన చోట ఓ కెనాల్ ఉందని, ఆ కెనాల్ వద్ద ప్రదేశం ఇరుకుగా ఉంటుందని, ఆ కెనాల్ను వ్యవసాయం కోసం వాడుతుందని ఆ అధికారి వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రిపేర్ చేసినట్లు వస్తున్న వార్తల్ని ఆయన తోసిపుచ్చారు. గుంతలు లేవని, వాటిని పూడ్చలేదన్నారు.