న్యూఢిల్లీ: భారతదేశం రాజకీయాల నుంచి విజ్ఞానశాస్ర్తాన్ని వేరు చేయాల్సిన అవసరముందని, యువ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు కొనసాగించడానికి స్వేచ్ఛ కల్పించాలని, అందుకు సరిపడా నిధులు సమకూర్చాలని ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ సూచించారు. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో శనివారం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏ దేశ సంపదైనా ఆ దేశ విజ్ఞానం, నూతనావిష్కరణలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
విజ్ఞాన శాస్ర్తానికి భారతదేశంలో పెట్టే ఖర్చు చాలా తక్కువగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూకే, యూఎస్లో యువ శాస్త్రవేత్తలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. సైన్స్ విషయంలో రాజకీయ జోక్యం తగదని పేర్కొంటూ అందుకు రెండు ఉదాహరణలు కూడా ఇచ్చారు. జర్మనీలో నాజీలు అత్యుత్తమ శాస్త్రవేత్తలను తరిమికొట్టారని, దీని వల్ల జర్మనీ సైన్స్ పరంగా దశాబ్దాల వెనక్కి వెళ్లిందని చెప్పారు. జన్యుశాస్త్రం అభివృద్ధి వల్ల ప్రజల్లో అంతర్గత విభేదాలు పెరుగుతాయనే తప్పుడు అభిప్రాయంలో రష్యాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఉందని తెలిపారు.