భువనేశ్వర్: ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటే బ్రహ్మాస్త్రం. ఓటుతోనే పాలకుల మెడలువంచి తమకు కావాల్సినవి జరిగేలా చేసుకోవచ్చు. అప్పటివరకు అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో కూడా ఓట్లు వస్తున్నాయంటే ఎంతో కొంత మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు అదే ఓటును ఆయుధంగా చేసుకున్నారు ఒడిశాలోని ఐదు గ్రామాల ప్రజలు. తమ డిమాండ్లను నెరవేరిస్తేనే ఓట్లేస్తామని, ఎన్నికల్లో పోటీచేస్తామని తెగేసి చెప్తున్నా.
ఒడిశాలోని డియోగఢ్ జిల్లా తైలిబని బ్లాక్లో గందామ్, ఝరాగోగువా, పర్పోషి, దిమిరికుడా, ఝార్ముండా అనే గ్రామాలు ఉన్నాయి. రాజధాని భువనేశ్వర్కు 235 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో మౌలిక వసతులు అంతంత మాత్రమే. కనీసం మెబైల్ నెట్వర్క్ కూడా అందుబాటులో లేదు. ప్రస్తుత కరోనా కాలంలో అంతా ఆన్లైన్ మయమైపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు. ఆన్లైన్ తరగతులు వినాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నదని ప్రజలు వాపోతున్నారు.
కాగా, ఆయా గ్రామాల్లో వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు జరనున్నాయి. తమకు ప్రధాన సమస్యగా మారిన మొబైల్ నెట్వర్క్ అంశాన్ని పరిష్కరించాలని పట్టుబడుతున్నారు. అలా అయితేనే తాము ఎన్నికల్లో పోటీ చేయాలని, ఓట్లు వేయాలని తీర్మానించుకున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలవలేదు. ఓ వాహనాన్ని ఏర్పాటు చేసుకుని నో నెట్వర్క్, నో ఓట్ (No network, no vote) అనే నినాదంతో ఊరూరా ప్రచారం కూడా చేస్తున్నారు.
నామినేషన్లు వేసేలా అధికారులు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. మొబైల్ నెట్వర్క్ సమస్యను పరిష్కరిస్తేనే ఎన్నికల్లో పాల్గొంటామని ఐదు గ్రామాల ప్రజలు తెగేసి చెబుతుండటంతో తలలు పట్టుకోవడం వారి వంతయింది. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని, వారే ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటారని అధికారులు వెల్లడించారు.