చెన్నై: నీట్ వ్యతిరేక బిల్లు (Anti NEET bill)కు గవర్నర్ ఆర్ఎన్ రవి సమ్మతి అవసరం లేదని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లుకు ఎప్పటికీ తాను క్లియరెన్స్ ఇవ్వబోనంటూ గవర్నర్ రవి శనివారం చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ స్పందించారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని కోరుతూ తమ ప్రభుత్వం తెచ్చిన బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరిందని తెలిపారు. దీంతో ఈ బిల్లు అంశంలో గవర్నర్ అవసరం ఏమీలేదని మీడియాకు తెలిపారు. ‘గవర్నర్కు వేరే దారి లేక ఈ బిల్లును రాష్ట్రపతికి పంపారు. అక్కడితో ఆయన పని అయిపోయింది. నీట్ బిల్లుతో ఆయనకు సంబంధం లేదు. ఆయన సమ్మతి కూడా అవసరం లేదు’ అని అన్నారు.
కాగా, నీట్ వ్యతిరేక బిల్లుపై రాష్ట్రపతి సంతృప్తి చెంది దానికి ఆమోదం తెలిపితే, ఆ సమాచారం మాత్రమే గవర్నర్ ద్వారా తెలుస్తుందని మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. అలాంటప్పుడు నీట్ మినహాయింపు బిల్లుకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కల్లోల జలాల్లో చేపలు పట్టడం వంటివని విమర్శించారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు గవర్నర్ ఆదర్శంగా నిలిచి మద్దతుగా ఉండాలని మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. అయితే నీట్ బిల్లును వ్యతిరేకించడంతోపాటు డీఎంకే పాలన, తమిళ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఆయన వైఖరి ఉన్నట్లుగా స్పష్టమవుతున్నదని విమర్శించారు. ఎందరో విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ను రద్దు చేస్తామని 2021 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారని, ఆ మేరకు నీట్ వ్యతిరేక బిల్లును డీఎంకే ప్రభుత్వం తెచ్చిందని వివరించారు.