చండీగఢ్: బీజేపీ బడా ఝూఠా (పెద్ద అబద్ధాల) పార్టీ అని ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ విమర్శించారు. ప్రస్తుతం ఎన్డీయే ఉనికిలో లేదన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం జేడీ(యూ), అకాలీదళ్, శివసేన వంటి మిత్ర పక్షాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని వీడాయని అన్నారు. హర్యానాలోని ఫతేహాబాద్లో మాజీ ఉప ప్రధాని దేవిలాల్ 109వ జయంతి వేడుకలు ఆదివారం జరిగాయి. ఐఎన్ఎల్డీ నిర్వహించిన ఈ మహా సభకు ప్రతి పక్షాలకు చెందిన అగ్ర నేతలు తరలివచ్చారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జేడీ(యూ) చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ సహా పలువురు ప్రముఖ నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తేజస్వీ యాదవ్, కేంద్రంలోని అధికార బీజేపీపై మండిపడ్డారు. అది పెద్ద అబద్ధాల పార్టీ అని, తప్పుడు వాదనలు, వాగ్దానాలు చేస్తున్నదని విమర్శించారు. శుక్రవారం బీహార్లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. పూర్ణాలో లేని ఎయిర్పోర్ట్ గురించి కూడా ఆయన మాట్లాడారని ఎద్దేవా చేశారు.
మరోవైపు ఇప్పుడు ఎన్డీయే అనేది అసలు లేదని తేజస్వీ యాదవ్ విమర్శించారు. జేడీ(యూ), అకాలీదళ్, శివసేన వంటి మిత్ర పక్షాలు రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని వీడాయని అన్నారు.