UP Assembly Results | సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ముందు వరుసలో నిలిచారు జాట్ రైతులు. కానీ యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ వ్యతిరేకత ఉన్నట్లు కనిపించడం లేదు. జాట్లు ప్రాతినిధ్యం వహిస్తున్న 24 స్థానాల్లో బీజేపీ 17 స్థానాలను గెలుచుకోగలిగింది. జాట్ల ప్రాతినిధ్య స్థానాల్లో బీజేపీ, రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ ఓట్లు, సీట్లు షేర్ చేసుకున్నట్లు ఫలితాలు చెబుతున్నాయి. మరోవైపు జాట్ల ఆధిపత్య ప్రాంతాల్లో బీఎస్పీ ఓటు బ్యాంక్ తుడిచిపెట్టుకుపోయింది. 2017 ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన బీఎస్పీ మద్దతుదారుల్లో అత్యధికులను ఆర్ఎల్డీ ఆకర్షించినట్లు ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.
ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి రాయబరేలీ, అమేథీ కంచుకోటలుగా ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో ఈ రెండు జిల్లాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పేశారు. ఈ ప్రాంతంలోని 14 స్థానాల్లో బీజేపీ 8, ఎస్పీ ఆరు స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం కూడా సింగిల్ డిజిట్కు పడిపోయింది. కేవలం 9.5 శాతం ఓట్లు మాత్రమే హస్తం పార్టీకి వచ్చాయి.
2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, ఈ దఫా ఫలితాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. విజయం సాధించిన అభ్యర్థుల ఆధిక్యతలు తారుమారయ్యాయి. 2017 ఎన్నికల్లో 63 మంది బీజేపీ అభ్యర్థులు 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేవలం 17 స్థానాల్లో మాత్రమే బీజేపీ 2000 లోపు ఓట్లతో బయటపడింది. కానీ తాజా ఎన్నికల ఫలితాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. 27 మంది బీజేపీ అభ్యర్థులు 50 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తే, 39 స్థానాల్లో కమలనాథుల మెజారిటీలు రెండు వేల లోపే ఉన్నాయి.