న్యూఢిల్లీ: దేశంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామే అంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాబోయే ప్రధాని అంటున్న ఆ పార్టీ, తమ తర్వాత టార్గెట్గా మోదీ ఇలాక అయిన గుజరాత్ను ఎంచుకున్నది. ఈ ఏడాది డిసెంబర్లో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్లో గెలుపుపై ఫుల్ జోష్లో ఉన్న ఆప్, వచ్చే నెలలో గుజరాత్లో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి అధికారంలో కొనసాగుతున్న బీజేపీకి గట్టి పోటీ ఇస్తామని ఆప్ సీనియర్ నేతలు తెలిపారు. డిసెంబర్ నెలలో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. తొలి ప్రయత్నంలోనే అధికారం దక్కకపోయినా, కాంగ్రెస్ను వెనక్కి నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా అయినా రాణిస్తామని ఆప్ గుజరాత్ ఇంచార్జి గులాబ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం గుజరాత్ ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.
గుజరాత్లో బీజేపీకి ప్రధాన పోటీగా ఆప్ నిలిచేలా రానున్న తొమ్మిది నెలల్లో కృషి చేస్తామని గులాబ్ సింగ్ తెలిపారు. గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ను 27 ఏండ్లుగా తిరస్కరిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని మూడో స్థానానికి నెట్టుతామని ధీమా వ్యక్తం చేశారు. దీని కోసం వచ్చే ఈ నెల నుంచే కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో కలిసి ఏప్రిల్లో భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తామన్నారు.