తిరువనంతపురం: కేరళలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కరోనా ఆంక్షల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మార్పు చేసింది. శనివారం రోజున లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేసింది. కేవలం ఆదివారం మాత్రమే లాక్డౌన్ కొనసాగనున్నది. దీంతో వారంలో ఆరు రోజులు షాపులు తెరుచుకోనున్నాయి. అలాగే స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్ట్ 15, ఓనమ్ పండగ రోజైన ఆగస్ట్ 22న అన్ని షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది.
మరోవైపు ఆగస్ట్ 8న రాష్ట్రవ్యాప్తంగా పూర్తి లాక్డౌన్ అమలవుతుందని కేరళ ప్రభుత్వం తెలిపింది. అలాగే వారంలో వెయ్యి మంది జనాభాలో పది కరోనా కేసులు గుర్తించిన ప్రాంతాల్లో ట్రిపుల్ లాక్డౌన్ అమలు చేస్తామని పేర్కొంది. ఆ ప్రాంతాల్లో నిత్యవసరాలకు సంబంధించిన షాపులు మాత్రమే తెరిచి ఉంటాయని వెల్లడించింది. వెయ్యి మంది జనాభాలో వారంలో పదిలోపు కరోనా కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో వారంలోని ఆరు రోజులు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని షాపులు తెరిచి ఉంటాయని చెప్పింది.
కాగా, కేరళలో కరోనా కేసుల నియంత్రణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మూడు దశల ట్రిపుల్ లాక్డౌన్ విధానాన్ని వ్యూహాత్మకంగా పరిశీలించింది. కరోనా కేసుల ఉధృతి ఒక్కసారిగా పెరిగిన ప్రాంతాల్లో తొలి లాక్డౌన్ను విధిస్తారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న పరిధిలో రెండో లాక్డౌన్, ఎక్కువ కేసులు ఉన్న ఇండ్ల వద్ద మూడవ లాక్డౌన్ను అమలు చేస్తారు.
మరోవైపు కేరళలో పర్యటించిన ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం కరోనా నియంత్రణలో పలు లోపాలను గుర్తించింది. ఆర్టీ పీసీఆర్కు బదులు ఎక్కువగా ర్యాపిడ్ టెస్టింగ్పై ఆధారపడటాన్ని తప్పుపట్టింది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో అనుసరించాల్సిన కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను కేరళ ప్రభుత్వం పాటించడం లేదని కేంద్ర బృందం ఆరోపించింది.