Congress-BJP | తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్ విజయ ధరణి శనివారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ కార్యదర్శి, తమిళనాడు ఇన్ చార్జి అరవింద్ మెనన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో వారం రోజులుగా కొనసాగుతున్న వదంతులకు తెర పడింది.
బీజేపీలో తన చేరికతో తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి దోహద పడుతుందని విజయ్ ధరణి అంచనా వేశారు. ప్రముఖ తమిళ కవి కవిమణి దేశిగ వినయగమ్ పిళ్లై కుటుంబానికి చెందిన వారే విజయ్ ధరణి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు మంచి పథకాలను తమిళనాడు సర్కార్ అమలు చేయడం లేదని ఆమె ఆరోపించారు. మహిళలపై బీజేపీ ఫోకస్ చేసిందని ఆమె కొనియాడారు. మహిళలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించనందు వల్లే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఆమెను నాగర్ కోయిల్ స్థానం నుంచి బీజేపీ బరిలో నిలుపుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.