శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో అధికారంలో ఉన్న జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్సీ)లో చీలిక ఊహాగానాలను సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. తమ పార్టీలో ‘ఎక్నాథ్ షిండేలు’ ఎవరూ లేరని అన్నారు. ఫిరాయింపులు జరుగవచ్చన్న బీజేపీ వాదనలను ఆయన తోసిపుచ్చారు. (Omar Abdullah) జేకేఎన్సీలో అంతర్గత సంక్షోభం ఉన్నదని బీజేపీకి చెందిన ప్రతిపక్ష నేత సునీల్ శర్మ ఆరోపించారు. ఆ పార్టీ నుంచి విడిపోవడానికి సిద్ధంగా ఉన్న ‘ఏక్నాథ్ షిండేలు’ చాలా మంది ఉన్నారని ఆయన తెలిపారు. పార్టీలో నెలకొన్న అసమ్మతి భయంతోనే సీఎం తన మంత్రివర్గాన్ని విస్తరించలేకపోతున్నారని విమర్శించారు. ఒమర్ అబ్దుల్లా తన మంత్రివర్గాన్ని విస్తరించిన వెంటనే జేకేఎన్సీ ‘పేక ముక్కలా కూలిపోతుంది’ అని వ్యాఖ్యానించారు.
కాగా, బీజేపీకి చెందిన ప్రతిపక్ష నేత సునీల్ శర్మ వ్యాఖ్యలను సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. జేకేఎన్సీలో ఫిరాయింపులు జరుగవచ్చని బీజేపీ చేస్తున్న వాదనలు వారి అసలు ఉద్దేశాలను బయటపెడుతున్నాయని విమర్శించారు. జేకేఎన్సీ ఎమ్మెల్యేలు పార్టీతోనే దృఢంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఏ ఎమ్మెల్యే కూడా తిరుగుబాటు చేసి బీజేపీలో చేరబోరని ఆయన అన్నారు.
మరోవైపు బీజేపీ ఉద్దేశాలను ఇది స్పష్టం చేస్తున్నది సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. బీజేపీ సహాయంతోనే ఏక్నాథ్ షిండే పార్టీని వీడినట్లు గుర్తు చేశారు. ‘ప్రతిపక్ష నాయకుడు (శర్మ) జమ్ముకశ్మీర్లో ముఖ్యమంత్రి కుర్చీని చేజిక్కించుకోవడానికి చాలా ఆత్రుతగా ఉన్నట్లు కనిపిస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్లో ‘ఏక్నాథ్ షిండే’లు లేరని నేను ఆయనకు చెబుతున్నా’ అని అన్నారు. ఎన్సీలో అంతర్గత విభేదాలపై ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు.
అలాగే మంత్రివర్గ విస్తరణలో జాప్యానికి, రాష్ట్ర హోదా పునరుద్ధరణకు మధ్య సంబంధం ఉన్నదని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ‘మాకు రాష్ట్ర హోదా కల్పించకపోవడం వల్లే మంత్రివర్గ విస్తరణ జరుగలేదు. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా నిరాకరించినందుకు బీజేపీని ప్రజలు క్షమించరు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తప్ప, జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదాను కేంద్రం పునరుద్ధరించకపోవచ్చని ప్రతిపక్ష నాయకుడి ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది’ అని ఎద్దేవా చేశారు.