Jamili Elections | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): లోక్సభకు ముందస్తు ఎన్నికలు లేనట్టేనా? పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంతో పరిశీలకులు ఈ అంచనాకు వస్తున్నారు. ‘అభీ చునావ్తో దూర్ హై. జిత్నా సమయ్ హమారా బచా హై, ఇస్ పార్లమెంట్ మే పక్కా మాన్తా హు కీ యహ జో వ్యవహార్ హోగా, యే నిర్ధారిత్ కరేగా.. కౌన్ యహా బైట్నే కే లియో వ్యవహార్ కర్తా హై. ఔర్ వహా బైట్నే కే లియే వ్యవహార్ కర్తా హై. జో వహాహీ బైటనా చాహతా హై ఉస్కా వ్యవహార్ క్యా హోగా. యహా భవిష్యమే బైట్నా చాహతా ఉస్కా వ్యవహార్ క్యా హోగా ఇస్కా పర్క్ బిల్కుల్ ఆనేవాలే మహీనోమే దేశ దేఖేగా (ఇప్పుడైతే ఎన్నికలకు చాలా సమయం ఉంది. ఈ పార్లమెంట్కు ఎంత సమయం మిగిలి ఉందో.. ఆ సమయంలో మనం చేసే పనులే ఇక్కడ (సభలో) అధికారంలో ఎవరిని కూర్చబెట్టేది లేనిది తేలుస్తాయి. ఇది వారి పనితనం మీద ఆధారపడి ఉంటుంది. రానున్న నెలల్లోనే దేశం ముందు ఇది తేలిపోతుంది) అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు తమకు ఇంకా సమయం ఉందని, ప్రస్తుత పార్లమెంట్ ముగియడానికి ఇంకా వ్యవధి ఉన్నదని ప్రధాని స్పష్టం చేశారు. దీనిని బట్టి లోక్సభకు ముందస్తు ఎన్నికలు వస్తాయని జరుగుతున్న ప్రచారానికి ప్రధాని మోదీనే పరోక్షంగా తెరదించినట్టు పరిశీలకులు భావిస్తున్నారు.
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఎందుకోసం నిర్వహిస్తున్నారన్న దానిపై రకరకాలుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల కోసమని, ముందస్తు ఎన్నికల కోసమని, యూనిఫామ్ సివిల్ కోడ్ కోసమని, మహిళా బిల్లు కోసమనే ప్రచారం జరిగింది. అయితే మహిళా బిల్లును కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించడం, దానిని మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టడంతో ఉహగానాలకు తెరపడినట్టుగా భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు కూడా లేవని ప్రధాని తన ప్రసంగంలో పరోక్షంగా స్పష్టం చేసినట్టు అయింది.