న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. హోలీ వేడుకపైనా దీని ప్రభావం పడనున్నది. హోలీ రోజైన ఈ నెల 29న మధ్యాహ్నం 2.30 గంటల వరకు అన్ని మార్గాల్లో మెట్రో రైల్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తెలిపింది. రాపిడ్ మెట్రోతోపాటు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్లలో కూడా మెట్రో రైళ్లను ఆ సమయం వరకు నడపబోమని పేర్కొంది. ఈ మేరకు శనివారం ట్వీట్ చేసింది.
మరోవైపు మెట్రో రైళ్లలో కరోనా నిబంధనలు పాటించని ప్రయాణికులకు జరిమానాలు విధిస్తున్నారు. ఈ నెల 26 వరకు 758 మంది నుంచి ఢిల్లీ మెట్రో ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది జరిమానాలు వసూలు చేసినట్లు తెలిపింది. అందరం కరోనా నిబంధనలు పాటిద్దామని, ఇతరులకు మర్యాదపూర్వకంగా అవగాహన కల్పిద్దామని పేర్కొంది.