న్యూఢిల్లీ: మహారాష్ట్రలో టీకాల కొరత ఉన్నదంటూ జరుగుతున్న ప్రచారం ఒట్టిదేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర దగ్గర 24 లక్షల డోసులు వినియోగించని కొవాగ్జిన్ టీకాలు ఉన్నాయని, ఇవాళ మరో 6.35 లక్షల టీకాలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తన ప్రకటనలో తెలిపింది. టీనేజర్లకు ఇస్తున్న ఈ కొవాగ్జిన్ టీకాలు మహారాష్ట్రలో మరో 10 రోజులకు సరిపోతాయని పేర్కొన్నది.
మహారాష్ట్రలో సరిపడా టీకాలు అందుబాటులో లేవని, దాంతో కరోనా కట్టడి కోసం అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కుదరడం లేదని ఇటీవల స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాక ఇవాళ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. మహారాష్ట్రలో వ్యాక్సిన్ల కొరత అంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించింది.
అదేవిధంగా కొవిషీల్డ్ టీకా డోసులు కూడా మహారాష్ట్రలో సరిపడా ఉన్నాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 3.57 లక్షల డోసుల సగటు వినియోగం ఉండగా.. 1.24 కోట్ల కొవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. అంటే 18 ఏండ్ల పైబడిన వారికి ఇస్తున్న కొవిషీల్డ్ టీకాలు కూడా ఏకంగా నెలరోజులకు సరిపోను ఉన్నాయని వివరించింది.