Rajnath Singh | ఇతర దేశాలపై దాడులు చేయడానికి భారత్ బ్రహ్మోస్ మిస్సైల్ను తయారు చేయడం లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే భారత్పై కన్నెత్తి చూసే సాహసం కూడా ఇతర దేశాలు చేయకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఈ మిసైల్ను తయారీ చేస్తున్నామని రాజ్నాథ్ స్పష్టం చేశారు. రక్షణ టెక్నాలజీ, టెస్ట్ సెంటర్తో పాటు బ్రహ్మోస్ తయారీ కేంద్రానికి లక్నోలో రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ… ‘బ్రహ్మోస్ క్షిపణితో పాటు ఇతర ఆయుధాలను భారత్ తయారు చేస్తోంది. ఇతర దేశాలపై దాడులు చేయడానికి ఇలా చేయడం లేదు. భారత్ లక్షణం కూడా అది కాదు. ఒక్క ఇంచు భూమిని కూడా మేం లాక్కోం. అయితే భారత్పై కన్నెత్తి చూసే సాహసం కూడా ఇతర దేశాలు చేయవద్దన్న ఏకైక లక్ష్యంతో బ్రహ్మోస్ను తయారీ చేస్తున్నాం.’ అని రాజ్నాథ్ స్పష్టం చేశారు.
పొరుగున ఉండే పాక్పై మంత్రి రాజ్నాథ్ తీవ్రంగా మండిపడ్డారు. భారత్ నుంచి విడిపోయిన ఆ దేశం ఎప్పుడూ భారత్ గురించి అంత చెడ్డగా ఎందుకు ఆలోచిస్తుందో తమకు ఏమాత్రం అర్థం కావడం లేదని, పైగా యూరీ, పుల్వామాలో ఉగ్రదాడులు కూడా చేసిందని రాజ్నాథ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ రెండు దాడుల తర్వాతే ఆ దేశ సరిహద్దులు దాటి మరీ, ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ధ్వంసం చేయాలని ప్రధాని మోదీ సంకల్పించారని రాజ్నాథ్ గుర్తు చేశారు. ఇలా దాడులు చేసి భారత్ సత్తా చాటమని ప్రకటించారు.