న్యూఢిల్లీ: వేతన జీవులను కేంద్ర బడ్జెట్ మళ్లీ నిరాశపరించింది. ఈ సారి కూడా ఆదాయపన్ను శ్లాబుల్లో కేంద్రం ఎటువంటి మార్పులు చేయలేదు. పన్ను మినహాయింపుల్లో ఉద్యోగులకు ఎటువంటి అవకాశం కల్పించలేదు. వివిధ శ్లాబుల్లో పన్నులు కట్టే వారికి ఎటువంటి మినహాయింపును మంత్రి నిర్మల ప్రకటించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్ను మినహాయింపు పరిమితిని 10 నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు మంత్రి చెప్పారు. దీని ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సామాజిక భద్రతా పథకాల లబ్ధి చేకూరుతుందన్నారు. ఇక ఆదాయపన్ను దరఖాస్తుల్లో జరిగే పొరపాట్లను సరి చేసుకునేందుకు కేంద్రం మరో అవకాశాన్ని కల్పించింది. అయితే ఆ దరఖాస్తుకు సంబంధించిన అప్డేట్ను రెండేళ్ల వరకు చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఇక సహకార సంస్థలపై పన్ను శాతాన్ని 15 శాతానికి తగ్గించారు. సహకార రంగాలపై సర్చార్జీని ఏడు శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి నిర్మల తెలిపారు. వర్చువల్ డిజిటల్ ఆస్తులపైన పన్నును 30 శాతానికి ఫిక్స్ చేశారు.