న్యూఢిల్లీ: సీయూఈటీ-యూజీ, జేఈఈ మెయిన్ పరీక్షల సిలబస్లో ఎలాంటి మార్పూ లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టంచేసింది. 10, 11, 12వ తరగతుల పాఠ్యపుస్తకాల్లో ఎన్సీఈఆర్టీ పలు మార్పులు చేసిన నేపథ్యంతో ఈ విషయాన్ని వెల్లడించింది. మరోవైపు సీయూఈటీ-యూజీ దరఖాస్తులకు ఎన్టీఏ మరో అవకాశం కల్పించింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
‘అనేక మంది విద్యార్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని సీయూఈటీ-యూజీ కోసం అప్లికేషన్ పోర్టల్ను మళ్లీ తెరువాలని నిర్ణయించాం. ఆది, సోమ, మంగళవారం రాత్రి 11.59 గంటల వరకు పోర్టల్ తెరిచి ఉంటుంది. ఆ తర్వాత క్లోజ్ అవుతుంది. విద్యార్థులు పూర్తి వివరాలకు cuet.samarth.ac.in చూడవచ్చు’ అని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. సీయూఈటీ-యూజీకి ఇప్పటికే 14 లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఈ సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 41 శాతం అధికం. సీయూఈటీ-యూజీ పరీక్షలు మే 21 నుంచి 31 వరకు జరుగనున్నాయి.