PM Modi | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: సైంటిస్టుల కృషితోనే చంద్రయాన్-3 సక్సెస్ అయిందంటూ చెబుతూనే, వివిధ అవార్డుల కింద సైంటిస్టులకు ఇచ్చే నగదు పురస్కారానికి మోదీ సర్కార్ మంగళం పాడుతున్నది. దాదాపు 300కుపైగా సైన్స్ అవార్డులను రద్దు చేస్తూ ‘రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల్ని’ ఇటీవల ఏర్పాటుచేసింది. యువ సైంటిస్టులకు ఇచ్చే శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును కూడా ఇందులో కలిపేసింది. విజ్ఞాన్ రత్న, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ శాంతి స్వరూప్ భట్నాగర్, విజ్ఞాన్ టీం.. పేరుతో ఈ పురస్కారాల్ని అందజేయనున్నది. వీటిలో దేనికీ నగదు పురస్కారం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.
చివరి శాంతి స్వరూప్ భట్నాగర్ (2022) అవార్డుల బహుకరణ మంగళవారం జరగనున్న వేళ, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ ఎన్ కలైసెల్వి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సైంటిస్టులకు క్యాష్ ప్రైజ్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మరో సీనియర్ అధికారి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. భట్నాగర్ అవార్డు గ్రహీతలకు రూ.5 లక్షల నగదు, 65 ఏండ్లు వచ్చేవరకు ప్రతినెలా రూ.15 వేల గౌరవవేతనం ఇప్పటివరకూ అందుతూ వచ్చింది. విజ్ఞాన్ పురస్కారాల ఏర్పాటుతో క్యాష్ ప్రైజ్లు రద్దయ్యాయి.