న్యూఢిల్లీ: ఇండియాలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. ఇవాళ రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. విమానాశ్రయాల వద్ద స్క్రీనింగ్ చేస్తున్నామని, పాజిటివ్ కేసులకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ గుర్తింపులో భాగంగా టెస్టింగ్ను పెంచాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఒమిక్రాన్తో ప్రపంచవ్యాప్తంగా హై రిస్క్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. కొత్త వేరియంట్ను నియంత్రించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆర్టీ పీసీఆర్, యాంటీజెన్ పరీక్షల్లోనూ ఒమిక్రాన్ను గుర్తించవచ్చు అని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలో తొలుత కనిపించిన ఈ వేరియంట్ ఇప్పుడు పలు దేశాల్లో విజృంభిస్తోంది.
కరోనా మహమ్మారి వేళ టీబీ వ్యాధి టెస్టింగ్పై ప్రభావం పడిందా అన్న ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. నిజానికి టీబీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు స్వల్పంగా తగ్గిందని, కానీ దాన్ని మళ్లీ రెట్టింపు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 2025 వరకు దేశం నుంచి క్షయ వ్యాధిని నిర్మూలించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. కోవిన్ యాప్ తరహాలో టీబీ కోసం ఓ యాప్ను రూపొందించాలని ఎంపీ రూపా గంగూలీ డిమాండ్ చేశారు.