పాట్నా, జనవరి 30: బీజేపీపై బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్కుమార్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీతో మరోసారి జట్టు కట్టే అవకాశమే లేదని కరాఖండిగా చెప్పిన ఆయన.. బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోవడం కంటే చనిపోవడం మేలని వ్యాఖ్యానించారు. నితీశ్కు ప్రజామోదం లేదని, రానున్న ఎన్నికల్లో ఆయనతో పొత్తు ఉండదని రాష్ట్ర బీజేపీ ఇటీవల పేర్కొనడంపై బీహార్ సీఎం పైవిధంగా స్పందించారు.
మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం పాట్నాలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన నితీశ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న సమయంలో.. తమ నుంచి బీజేపీనే అధికంగా లాభం పొందిందని, బీజేపీకి దూరంగా ఉండే ముస్లింలు కూడా గతంలో తనను చూసి ఆ పార్టీకి ఓటేశారని అన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్లు తమ అభ్యర్థులకు బదలాయించకుండా మిత్ర ద్రోహానికి పాల్పడిందని మండిపడ్డారు.
మళ్లీ కలిసి తప్పు చేశాను..
2017లో తిరిగి బీజేపీతో కలిసి తప్పు చేశానని నితీశ్ అన్నారు. లాలూప్రసాద్పై బనాయించిన కేసులు నిరాధారమైనవేనని పేర్కొన్నారు. బీహార్లో 40 లోక్సభ స్థానాలకు 36 గెలుస్తామని బీజేపీ నేతలు చెప్పుకోవడంపైనా నితీశ్ విమర్శలు గుప్పించారు. ఎన్నికలు వచ్చినప్పుడు వారికి వాస్తవం తెలుస్తుందని, బీహార్లో బీజేపీకి ఓటమి తప్పదని స్పష్టం చేశారు.