Nitsh kumar : విపక్ష ఇండియా కూటమికి మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీ నేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా బ్లాక్ నుంచి వైదొలగనున్నారనే ప్రచారం సాగుతోంది. చివరిక్షణంలో యూటర్న్ తీసుకున నితీష్ రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టనున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
కాంగ్రెస్తో పొత్తు ఉండదని ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేయడంతో తాజాగా నితీష్ కుమార్ సైతం విపక్ష కూటమి నుంచి వైదొలగనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. పట్నాలో తమ పార్టీ ఎమ్మెల్యేలందరితో సమావేశమైన నితీష్ తాను తొలుత రాజీనామా చేసి ఆపై బీజేపీ, జితన్ రాం మాంఝీ. ఇతరుల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చెప్పినట్టు సమాచారం. నూతన క్యాబినెట్ ఏర్పాటు చేసిన అనంతరం అసెంబ్లీ రద్దు చేసి ప్రజా తీర్పుకు వెళతానని స్పష్టం చేసినట్టు చెబుతున్నారు.
ఇదే జరిగితే నితీష్ కుమార్ జట్టు మార్చడం ఇది ఐదో సారి అవుతుంది. 2013 నుంచి నితీష్ కుమార్ ఎన్డీయే, మహాకూటమి మధ్య దోబూచులాట సాగిస్తున్న సంగతి తెలిసిందే. మహా కూటమి నుంచి ఎన్డీయేలో చేరిన మూడేండ్ల తర్వాత నితీష్ 2022లో తిరిగి కూటమి శిబిరంలో చేరారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని ఆహ్వానం అందినా నితీష్ కుమార్ స్పందించకపోవడం కూడా ఆయన తిరిగి ఎన్డీయే కూటమికి చేరువవుతున్నారనే వార్తలకు బలం చేకూరుతోంది. ఇండియా కూటమి లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు, ప్రధాని అభ్యర్ధిత్వంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంపైనా నితీష్ అసంతృప్తితో ఉన్నారని జేడీయూ వర్గాలు పేర్కొన్నాయి.
Read More :