పాట్నా: బీహార్ సీఎం, జనతాదళ్ (యునైటెడ్) చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) ఈ నెల 24న ఉత్తరప్రదేశ్లో తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆ సభా కార్యక్రమం రద్దైనట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, యూపీ వ్యవహారాల ఇన్చార్జీ, బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ తెలిపారు. ప్రధాని మోదీ వారణాసి లోక్సభ నియోజకవర్గం రోహనియాలోని జగత్పూర్ ఇంటర్ కాలేజీలో బహిరంగ సభ నిర్వహణకు అనుమతి ఇస్తామని ఆ యాజమాన్యం గతంలో హామీ ఇచ్చిందన్నారు. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం ఒత్తిడితో సభకు అనుమతి ఇవ్వడం లేదని గురువారం తెలిపిందన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్లో నితీశ్ సభకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్పై శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. యోగి నియంతృత్వంలో ఉత్తరప్రదేశ్ ఉందని ఆరోపించారు. వారణాసిలో తమ పార్టీ అధినేత నితీశ్ బహిరంగ సభకు అనుమతించకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. అయినా తాము వెనక్కి తగ్గబోమని అన్నారు. యూపీలో బీజేపీని బట్టబయలు చేసేందుకు సామూహిక ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే లోక్సభ ఎన్నికల కోసం తగిన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.