పాట్నా, నవంబర్ 8: రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాలని బీహార్ సీఎం నితీశ్కుమార్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని అన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాను సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించిన నేపథ్యంలో నితీశ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. కోర్టు తీర్పు చాలా న్యాయమైనదని, కోటాకు తాము అన్నివేళలా మద్దతు తెలిపామని పేర్కొన్నారు. ఇదే సమయంలో రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసేందుకు సమయం ఆసన్నమైందని అన్నారు.
తమిళనాడులో 12న అఖిలపక్ష భేటీ
ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఈ నెల 12న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటా సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకమని, సామాజిక న్యాయ విధానానికి విరుద్ధమని ప్రభుత్వం పేర్కొన్నది. సుప్రీంకోర్టు తీర్పు దశాబ్దాలనాటి సామాజిక న్యాయ పోరాటానికి ఎదురుదెబ్బ అని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు.