పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్పై ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. నితీశ్కుమార్ గంజాయి తాగేవారంటూ ఆరోపించారు. బీహార్లో మద్యపాన నిషేధ చట్టాన్ని విజయవంతంగా అమలు సీఎం ప్రమాణం కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలో.. రాజ్వంశీ మహతో ఈ విమర్శలు చేశారు.
‘సీఎం నితీశ్కుమార్ కూడా గంజాయి తాగుతారు. ఇది మత్తు కేటగిరి కిందకు వస్తుంది. రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు, వినియోగం కూడా నిషేధించబడింది. ఆయన గంజాయి వ్యసనాన్ని ఎందుకు విడిచిపెట్టడం లేదు?’ అంటూ బెగుసరాయ్ జిల్లాలోని చెరియా బరియార్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్వంశీ మహతో ప్రశ్నించారు.
‘బీహార్లో మద్యపాన నిషేధం కేవలం కంటితుడుపు చర్య మాత్రమే. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో, నగరంలో అందుబాటులో ఉంది. నితీశ్కుమార్ కేవలం ప్రజలను మభ్యపెడుతున్నారు’ అంటూ విమర్శించారు. ‘మద్యాన్ని నిషేధిస్తే నితీశ్కుమార్ ఇతరులను ఎందుకు ప్రమాణం చేయమని బలవంతం చేస్తున్నారు. దానిని తనపై ఎందుకు అమలు చేయడం లేదు’ అన్నారు.
రాష్ట్ర పోలీసులు పేదలపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని, అసలైన మాఫియాపై కాదన్నారు. ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి చిత్రాంజన్ గగన్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో నితీశ్కుమార్ గంజాయి మత్తు ట్రెండ్ అవుతోందన్నారు. పాట్నా పోలీసులు మహిళా పోలీసులతో కలిసి కొత్తగా పెళ్లయిన వధువుల గదిలోకి ప్రవేశించడం, పోలీసుల చర్యను నితీశ్ సమర్థించడం సిగ్గుచేటన్నారు.