Nitish Kumar : బిహార్ రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయా..? తాజా ప్రచారం చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. బిహార్ సీఎంగా ఉన్న నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి, రాజ్యసభకు వెళ్లబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే బిహార్ రాజకీయాల్లో సంచలనం రేగడం ఖాయం. ప్రస్తుతం ఎన్డీయే ఆధ్వర్యంలోని ఉమ్మడి ప్రభుత్వం కొలువుదీరి ఉంది. బిహార్లో నితీష్ కుమార్ (జేడీయూ) సీఎంగా కొనసాగుతున్నారు.
ఒప్పందంలో భాగంగా ఆయనకు సీఎం పదవి దక్కింది. కానీ, కూటమిలోని బీజేపీకి ఎక్కువ అసెంబ్లీ స్థానాలున్నాయి. 243 అసెంబ్లీ స్థానాలకుగాను ఎన్డీయేకు 202 సీట్లున్నాయి. అందులో అత్యధికంగా బీజేపీకి 89, ఆ తర్వాత జేడీయూకు 85, కూటమిలోని మిగతా పార్టీలకు 28 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి నుంచి నితీష్ తప్పుకొంటారనే ప్రచారం జరుగుతోంది. ఆయనను రాజ్యసభకు పంపాలని జేడీయూ, బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దీనికి కావాల్సిన ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. జేడీయూ కూడా దీనిపై అంగీకారం తెలిపింది. రాజ్యసభకు నితీష్ నామినేషన్ వేసేందుకు తగిన పత్రాలు కూడా సిద్ధమయ్యాయి. ఆయన సంతకం పెడితే చాలు.. నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధమైంది. బిహార్ నుంచి జేడీయూ తరఫున రెండు రాజ్యసభ స్థానాలకు అవకాశం ఉంది. అందులో రామనాథ్ ఠాకూర్ను ఒక అభ్యర్థిగా ఖరారు చేశారు.
రెండో అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రెండో స్థానంలోనే నితీష్ రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది. నితీష్ దీనికి పూర్తిగా అంగీకరిస్తే గురువారం నాడే నామినేషన్ దాఖలు చేస్తారు. ఇదే జరిగితే నితీష్ బిహార్లో చేపట్టబోయే మలిదశ ‘సమృద్ధి యాత్ర’ వాయిదా పడొచ్చు. ఈ యాత్ర ఈ నెల 8న ప్రారంభం కావాలి. నితీష్ రాజ్యసభకు వెళ్తే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో బిహార్కు కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి. ఈసారి ఆ స్థానాన్ని కూటమిలో అత్యధిక స్థానాలున్న బీజేపీ తీసుకుంటుంది. ఆ పార్టీ అభ్యర్థి నూతన సీఎం అవుతారు. రాష్ట్ర రాజకీయాల నుంచి నితీష్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకోవడం కూడా ఆయన రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకోవడానికి కారణమని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.