Nitish Kumar | విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలకంగా వ్యవహరించిన జేడీయూ అధినేత-బీహార్ సీఎం నితీశ్ కుమార్ మళ్లీ ‘యూటర్న్’ తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఆదివారం ప్రస్తుత మహాఘట్ బంధన్ కూటమి సర్కార్లో ఆర్జేడీ మంత్రులను తొలగించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మూడు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీహార్లో సీట్ల సర్దుబాటుపై బీజేపీతో నితీశ్ కుమార్ ఒప్పందం చేసుకున్నట్లు ఆ వర్గాల కథనం. ఇప్పటికే నితీశ్ కుమార్కు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యేలు లేఖలు సమర్పించారు.
ఆదివారం తన నివాసంలో సీఎం నితీశ్ కుమార్.. జేడీయూ, బీజేపీ ఎమ్మెల్యేలకు లంచ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రెండు పార్టీల ఎమ్మెల్యేలు గవర్నర్ను కలిసి మద్దతు లేఖలు సమర్పిస్తారని తెలుస్తున్నది. ఆదివారం జేడీయూ ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేస్తారు. తిరిగి బీజేపీ మద్దతుతో ఆదివారం సాయంత్రం సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం చేస్తారు.
2022 ఆగస్టులో ఎటువంటి కారణం లేకుండానే బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో మహాఘట్ బంధన్ కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జన నాయక్గా పేరు తెచ్చుకున్న ఓబీసీ నేత బీహార్ మాజీ సీఎం కీ.శే. కర్పూరీ ఠాకూర్కు కేంద్రం భారత రత్న ప్రకటించిన నేపథ్యంలో నితీశ్ కుమార్ వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలుస్తున్నది. దీంతో లోక్ సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహం, సీట్ల సర్దుబాటుపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో నితీశ్ కుమార్ నేరుగా చర్చించారని తెలుస్తున్నది.