లక్నో: బీహార్లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar).. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని దెబ్బకొట్టడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించడానికి ఉత్తరప్రదేశ్ నుంచి బరిలోకి దిగాలని జేడీయూ అధినేత నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో నితీశ్ కుమార్.. యూపీలోని ఫుల్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని ఏ స్థానం నుంచైనా పోటీ చేయాలని యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.. నితీశ్ను ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి బరిలోకి దిగినట్లయితే ఎస్పీ పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
కాగా, ఫుల్పూర్ నుంచే కాకుండా అంబేద్కర్ నగర్, మీర్జాపూర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి నితీశ్ పోటీ చేసే అవకాశం ఉందని జేడీయూ యూపీ అధ్యక్షుడు లలన్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీకి 65 మంది ఎంపీలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జేడీయూ, ఎస్పీ కలిసి పోటీచేసినట్లయితే ఆ స్థానాలు 15 నుంచి 20కి తగ్గిపోతాయన్నారు. దీంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా నిలువరించే అవకాశం ఉంటుందని చెప్పారు.