పాట్నా: బీహార్ సీఎం, ఇండియా కూటమి నేత నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో తిరిగి చేరేది లేదని చెప్పుకొస్తున్న ఆయన బీజేపీ నేతలు తన స్నేహితులని, తాను బతికున్నంత కాలం వారితో స్నేహం ఉంటుందని తాజాగా పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం మోతిహరిలో నితీశ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కలిసి పనిచేద్దాం. మిగతా పనులను పూర్తి చేయడంలో మీ సహకారాన్ని ఆశిస్తున్నా’ అని అన్నారు. ‘ఎవరు ఎక్కడున్నా, వీళ్లంతా నా స్నేహితులు. మా స్నేహం నేను బతికున్నంత కాలం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నాను. చింతించకండి!’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్, పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.