బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2004-09 సమయలో రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగాలు ఇప్పిచ్చినందుకు ప్రతిఫలంగా అభ్యర్థుల నుంచి తక్కువ ధరకే ఫ్లాట్లను సొంతం చేసుకున్నారన్నది లాలూ కుటుంబీకులపై వచ్చిన అభియోగం.
అయితే ఈ విషయంపై స్పందించాల్సిందిగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ను విలేకరులు కోరారు. దీనిపై సీఎం నితీశ్ చాలా చప్పగానే స్పందించారు. ఈ సోదాల విషయం సోదాలు చేసిన వారినే అడగండి… ఆ సోదాల గురించి నాకు తెలియదు అంటూ ముక్తసరిగానే సమాధానం ఇచ్చారు. ఈ సోదాల గురించి ఏమీ తెలియదు. సోదాలు చేసే వారినే సోదాల గురించి అడగండి. వారే జవాబిస్తారు అంటూ సీఎం నితీశ్ మాట్లాడారు.
కొన్ని రోజుల క్రితం సీఎం నితీశ్… ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్ నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. దీంతో ఈ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తేజస్వీ యాదవ్ ఇంటికి వెళ్లి మరీ, సీఎం నితీశ్ ఇఫ్తార్ స్వీకరించారు. మళ్లీ ఇద్దరు ఒక్కటవుతున్నారని తెగ ప్రచారం జరిగింది. అయితే దీనిని తేజస్వీ యాదవ్ ఖండించారు. ఇఫ్తార్ విందులతో రాజకీయం మారదని, రాజకీయ కోణంలో చూడొద్దని తేజస్వీ సూచించారు.