న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: వచ్చే లోక్సభ ఎన్నికల్లో ‘మెయిన్ ఫ్రంట్’ కోసం బీజేపీయేతర పార్టీలన్నీ కలిసిరావాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. బీజేపీయేతర పార్టీలు కలిస్తే థర్డ్ ఫ్రంట్ కాదని, అదే ‘మెయిన్ ఫ్రంట్’ అని పేర్కొన్నారు. అయితే దీనికి ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయం తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. గత మూడు రోజులుగా ఢిల్లీలో ఉండి, పలు ప్రతిపక్ష పార్టీల నేతలతో నితీశ్ సమావేశమయ్యారు. బుధవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో సమావేశమయ్యారు.
ప్రతిపక్ష నేతలతో సమావేశం బాగా జరిగిందని, వారందరూ సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. అందరూ కలసి ప్రణాళికబద్ధమైన ఎజెండా రూపొందిస్తే 2024 ఎన్నికల్లో పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పారు. ‘జాతీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, లెఫ్ట్, ఇతర పార్టీలు కలిసి ముందుకు రావాలి. ఒకవేళ అన్ని రాష్ర్టాల్లోని బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపై వస్తే దేశంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది’ అని పేర్కొన్నారు. ఇక బీజేపీకి దేశంలో ఆందోళనలు సృష్టించే పాలసీ మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.