Jairam Ramesh: ఇవాళ (ఆదివారం) ఉదయం బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్కుమార్పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తీవ్ర విమర్శలు చేశారు. నితీశ్ కుమార్ రాజీనామా తనను పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయలేదని చెప్పారు. ఎందుకంటే ఆయన ఒక సీజన్డ్ పొలిటీషియన్ అని, సీజన్ల వారీగా ఆయన రంగులు మారుస్తుంటారని ఆరోపించారు.
నితీశ్ కుమార్ కొన్నాళ్లు ఆర్జేడీ, కాంగ్రెస్తో.. మరికొన్నాళ్లు బీజేపీతో అంటకాగుతూ సీఎం పదవి చేపడుతుండటంపై జైరామ్ రమేశ్ మండిపడ్డారు. ఆయన ఏళ్లుగా రంగులు మారుస్తూ వస్తున్నారని విమర్శించారు. రంగులు మార్చడంలో నితీశ్ ఊసరవెల్లులకే కఠిన సవాల్ విసురుతున్నారని ఎద్దేవా చేశారు. నితీశ్ కుమార్కు, ఢిల్లీ నుంచి ఆయనతో నాట్యం చేయిస్తున్నవాళ్లకు వచ్చే ఎన్నికల్లో బీహార్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రను చూసి బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్షా ఆందోళన చెందుతున్నారనడానికి బీహార్లో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలే నిదర్శనమని జైరామ్ రమేశ్ చెప్పారు. రాహుల్ యాత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే బీజేపీ ఈ డ్రామాలకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. నమ్మక ద్రోహం చేయడంలో నితీశ్కుమార్ నిపుణుడని దుమ్మెత్తిపోశారు.