పాట్నా, డిసెంబర్ 13: తన రాజకీయ వారసుడిగా, భవిష్యత్తులో జేడీయూ, ఆర్జేడీ కూటమిని నడిపించే నాయకుడిగా తేజస్వీ యాదవ్ ఉంటారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. తాను భవిష్యత్తులో ప్రధానమంత్రి అభ్యర్థిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండబోనని, బీజేపీని ఓడించడం మాత్రమే తన ఏకైక లక్ష్యమని నితీశ్ స్పష్టం చేశారు. 2025 అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలో తమ కూటమిని తేజస్వీ యాదవ్ నడిపిస్తారని ప్రకటించారు. ఈ దిశగా తేజస్వీ యాదవ్ను మరింత ప్రోత్సహిద్దామని రెండు పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చారు. బీహార్ కోసం తామిద్దరం కలిసి ప్రస్తుతం చాలా పనులు చేస్తున్నామని, మిగిలి ఉన్నవి భవిష్యత్తులో తేజస్వీ చేస్తారని చెప్పారు. తమ మధ్య చిచ్చుపెట్టేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు వృథా ప్రయాసేనని, తాము కలిసే ఉంటామని స్పష్టం చేశారు.