న్యూఢిల్లీ : భారత్లో 2020 సంవత్సరంలో 1,58,964 మంది ద్విచక్ర వాహన ప్రమాదాలు జరిగాయని, ఇందులో 56,873 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. బుధవారం ఆయన పార్లమెంట్లో వివరాలను వెల్లడించారు. 2019లో దేశవ్యాప్తంగా జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదాల్లో 56,136 మంది మరణించగా.. 167,184 ప్రమాదాలు జరిగాయని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వివిధ అంశాలతో రహదారి భద్రత సమస్యలను పరిష్కరించే బహుముఖ వ్యూహాన్ని రూపొందించిందని గడ్కరీ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు నమోదవుతున్న దేశాల జాబితాల్లో భారత్ ఒకటి. దేశంలో ప్రతి ఏటా సుమారు 4.50లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. సుమారు 1.50లక్షల మంది ప్రాణాలు కోల్పోతుండగా.. అనేక మంది గాయాలపాలవుతున్నారు. అయితే, రోడ్డు ప్రమాదాల కారణంగా అత్యధిక మరణాలు నమోదవుతున్నది కేవలం భారత్లోనే. దేశంలో ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారని ఒక అంచనా.
రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న వాటిలో ఎక్కువగా ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. ఈ ప్రమాదాలకు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే ఓ కారణం. అదే సమయంలో రహదారులు, ఇతర కారణాలు లేకపోలేదు. ఈ ప్రమాదాలు ఎక్కువగా జాతీయ రహదారులపైనే చోటు చేసుకుంటున్నాయి. అయితే, ద్విచక్ర వాహనాలతో జరిగే ప్రమాదాలను నివారించే ప్రయత్నంలో రహదారుల మంత్రిత్వ శాఖ కీలక చర్యలు చేపట్టింది.
125 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ ఉన్న అన్ని ద్విచక్ర వాహనాల్లో ఏబీఎస్ (ఎంట్రీ బ్రేక్ సిస్టమ్) ఫీచర్ అందుబాటులోకి తీసుకురావాలని ద్విచక్ర వాహనదారులకు సూచించింది. 125 సీసీ లేదంటే తక్కువ సామర్థ్యం కలిగిన ఇంజిన్ మోడల్లో తప్పనిసరిగా సీబీఎస్ (కాంబి-బ్రేకింగ్ సిస్టమ్)ను అందించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు 2019, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. మరోవైపు, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా మొత్తాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది.