న్యూఢిల్లీ : దేశంలో రోడ్డు మౌలిక సదుపాయాలను 2024 నాటికి అమెరికాతో సమానంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మరింత కృషి చేయాలన్నారు. రోడ్డు మౌలిక సదుపాయాల విస్తరణ ఒక్కటే సమస్య కాదని, రోడ్ ఇంజినీరింగ్, ఆటో మొబైల్ ఇంజినీరింగ్, పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇతర అంశాలు సైతం ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి దేశంలో ప్రజలు ఎంత సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ను ఎలా పొందుతున్నారో చెప్పారు.
ఎంపీ హనుమంతయ్య అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇస్తూ.. జాతీయ రహదారులపై ప్రమాదాల సంఖ్య, జాతీయ రహదానులను కలిపే రహదారుల విస్తరణపై ప్రభుత్వ దృష్టి అని, ఆ దిశగా మంత్రిత్వ శాఖ అడుగులు వేస్తుందన్నారు. భారత్లో ఏటా 1.5లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటికి కారణాలను తెలిపారు. ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య.. యుద్ధంలో మరణించిన వారి కంటే చాలా ఎక్కువ అనీ, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు బ్లాక్స్పాట్లను గుర్తించి ఒక్కో పాయింట్లో ఒకటికంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు గడ్కరీ వివరించారు.