Nithin Kamath: ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెరోదా (Zerodha) సహ వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈవో నితిన్ కామత్ (Nithin Kamath) కొన్ని వారాల క్రితం పక్షవాతం బారినపడ్డారు. ఈ విషయాన్ని సోమవారం ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘దాదాపు ఆరు వారాల క్రితం అనూహ్యంగా నేను స్వల్ప పక్షవాతానికి గురయ్యాను. మా నాన్న మరణం, నిద్రలేమి, తీవ్ర మానసిక అలసట, డీహైడ్రేషన్, పని ఒత్తిడి.. వీటిలో ఏదైనా నా అనారోగ్యానికి కారణం కావొచ్చు’ అని పేర్కొన్నారు.
‘అనారోగ్యంవల్ల నా ముఖం వంకర తిరిగి చదవడం, రాయడం వంటివి కూడా చేయలేకపోయా. ఇప్పుడు కాస్త నయమైంది. పూర్తిగా కోలుకోవడానికి 3 నుంచి 6 నెలలు పడుతుంది. ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునే నాకు ఇలా ఎలా జరిగిందని ఆశ్చర్యపోయా. పని ఒత్తిడిని ఎప్పుడు తగ్గించుకోవాలో తెలుసుకోవాలని వైద్యులు చెప్పారు. కాస్త అనారోగ్యంగా ఉన్నా ట్రెడ్మిల్పై రన్నింగ్ చేయగలుగుతున్నా’ అని 44 ఏళ్ల నితిన్ కామత్ తన పోస్ట్లో రాసుకొచ్చారు.
ఆస్పత్రి బెడ్పై ఉన్న ఫొటోను కామత్ షేర్ చేశారు. ఆయన ఆరోగ్యం గురించి తెలియగానే ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ స్పందించారు. ‘డ్యూడ్.. కాస్త జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసి మీ తండ్రి మరణమే మీ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపి ఉంటుంది. మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కాస్త బ్రేక్ తీసుకోండి’ అని సూచించారు. వ్యాపార రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా నితిన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.