Nishikant Dubey | టీఎంపీ ఎంపీ మహువా మొయిత్రాను ఎవరూ కాపాడలేరని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ చేపట్టింది. ఎంపీ మహువా గురువారం కమిటీ ముందు విచారణకు హాజరైంది. ప్యానల్ చైర్మన్ వ్యక్తిగత, అనైతిక ప్రశ్నలు అడిగారంటూ ఆరోపిస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఎంపీ ఆరోపణలపై కమిటీ చీఫ్ వినోద్ సోంకర్ స్పందించారు. ప్రతిపక్ష సభ్యులు అనైతికంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు బదులు కోపం వచ్చిందని.. చైర్మన్తో పాటు కమిటీ సభ్యులపై అన్పార్లమెంటరీ పదజాలాన్ని ఉపయోగించారన్నారు. మరోసారి కమిటీ సమావేశమై కార్యాచరణను నిర్ణయిస్తుందన్నారు. అదే సమయంలో టీఎంసీ ఎంపీపై ఆరోపణలు చేసిన నిషికాంత్ దూబే స్పందిస్తూ.. మహువా మొయిత్రా తీరును తప్పుపట్టారు. ఆరోపణలపై స్పందించాలన్నారు. తమతో పాటు ఇతరులు అందించిన అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత మహువా మొయిత్రాను ఏ శక్తీ రక్షించలేదన్నారు.
అనంత్ దెహద్రాయ్తో పాటు సాక్షులుగా, నిందితురాలిగా మహువా కమిటీ ముందుకు వెళ్లామన్నారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. పార్లమెంట్ చరిత్రలో చీకటి రోజన్నారు. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సమావేశం అనంతరం బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి మాట్లాడుతూ సమావేశంలో మహువా మోయిత్రా వ్యవహరించిన తీరు ఖండించతగిందని.. చైర్మన్తో పాటు కమిటీ సభ్యులందరినీ ఉద్దేశించి అన్పార్లమెంటరీ పదాలు వాడారన్నారు. కమిటీ చైర్మన్ హీరానందానీ అఫిడవిట్లోని విషయాలపై ప్రశ్నలు అడిగితే.. వాటికి సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదని.. ఆ తర్వాత రచ్చ సృష్టించారన్నారు.